సింగరేణి ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. చుంచుపల్లి మండలంలోని సీపీఐ ఆఫీస్లో గురువారం జరిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సింగరేణికి భారీగా పెండింగ్ బకాయిలు ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
సింగరేణికి దాదాపు రూ. 25 వేల కోట్లు బకాయిలుగా ఉంటే, వ్యాపార విస్తరణపై మాత్రం ప్రభుత్వం, యాజమాన్యం దృష్టిసారించలేదని ఆరోపించారు. కేవలం లాభాలకే ఆసక్తి చూపుతూ, కొత్త గనుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో సింగరేణి మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సింగరేణి పరిరక్షణకు ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జీవో నం. 22ను సింగరేణిలో అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, అలాగే ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, నేతలు మిర్యాల రంగయ్య, కె. సారయ్య, వంగా వెంకట్, రమణమూర్తి పాల్గొన్నారు.