తెలంగాణ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించి, వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించింది.
గ్రూపుల వారీగా రిజర్వేషన్లు:
- గ్రూప్ A: సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1% రిజర్వేషన్.
- గ్రూప్ B: మాదిగ మరియు దాని ఉపకులాలైన 18 కులాలకు 9% రిజర్వేషన్.
- గ్రూప్ C: మాల మరియు దాని ఉపకులాలైన 26 కులాలకు 5% రిజర్వేషన్.
ఈ వర్గీకరణ ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో మొదట గ్రూప్ A, తరువాత గ్రూప్ B, చివరగా గ్రూప్ C కులాల అభ్యర్థులతో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ప్రతి గ్రూపుకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లు కేటాయించబడ్డాయి.

జనాభా గణాంకాల ఆధారంగా వర్గీకరణ:
ప్రస్తుతం గ్రూప్ Aలో 1,71,625 మంది, గ్రూప్ Bలో 32,74,377 మంది, గ్రూప్ Cలో 17,71,682 మంది ఉన్నారు. 2026 జనాభా లెక్కలు పూర్తైన తర్వాత, ఈ వర్గీకరణను జనాభా గణాంకాల ఆధారంగా పునఃసమీక్షించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గెజిట్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విడుదల చేయబడింది. ఈ చర్యతో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వివాదాలకు ముగింపు పలకాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్-A లోని కులాల వారితో, అక్కడ మిగిలితే గ్రూప్-B, ఆ తర్వాత గ్రూప్-C లోని వ్యక్తులతో భర్తీ చేస్తారు. మూడు గ్రూపుల్లోనూ అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు.
రోస్టర్ పాయింట్ల విభజన ఇలా..
గ్రూప్-A లోని వారికి 7వ రోస్టర్ పాయింట్, గ్రూప్-B లోని వారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87,97, గ్రూప్-C లోని వారికి 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు ఉంటాయి.